Telangana Elections 2023: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 63.94 శాతం పోలింగ్‌ నమోదు

ఎగ్జిట్ పోల్స్‌లో బీఆర్ఎస్ వెనక్కి నెట్టి దూసుకుపోతున్న కాంగ్రెస్‌..

Share this :

హైదరాబాద్‌, నవంబర్‌ 30: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ (Telangana Elections 2023) సమయం ముగిసింది. అక్కడక్కడ స్వల్ప ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు సుమారు 63.94 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మావోయిస్టుల ప్రభావం, సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగిసింది. క్యూలో ఉన్న వారిని మాత్రమే 5 గంటల వరకు ఓటు వేసేందుకు అనుమతించారు. దీంతో పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు (Voters) బారులు తీరారు. అత్యధికంగా మెదక్ (Medak) జిల్లాలో 80.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ (Hyderabad)లో 39.97 శాతం పోలింగ్‌ నమోదైంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదైంది. ఉదయం నుంచి మందకోడిగా సాగిన ఓటింగ్‌ సాయంత్ర ఒక్కసారిగా ఊపందుకుంది. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

చదవండి: Venomous Snake at Vizag: జాలర్ల వలకు చిక్కిన సాగర సర్పం.. కాటేస్తే యమ డేంజర్‌

జిల్లాల వారీగా తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ శాతం ఇలా..

ఆదిలాబాద్‌లో 73.58 శాతం, భద్రాద్రి 66.37 శాతం, హనుమకొండ 62.46 శాతం, హైదరాబాద్‌ 39.97 శాతం, జగిత్యాల 74.87 శాతం, జనగామ 80.23 శాతం, భూపాలపల్లి 76.10 శాతం, గద్వాల 73.60 శాతం, కామారెడ్డి 71.00 శాతం, కరీంనగర్‌ 69.22 శాతం, ఖమ్మం 73.77 శాతం, కుమురంభీం 71.63 శాతం, మహబూబాబాద్‌ 77.50 శాతం, మంచిర్యాల 70.71 శాతం, మెదక్‌ 80.28 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరి 49.25 శాతం, ములుగు 75.02 శాతం, నాగర్‌కర్నూల్‌ 70.83 శాతం, నల్గొండ 75.72 శాతం, నారాయణపేట 67.70 శాతం, నిర్మల్‌ 71.47 శాతం, నిజామాబాద్‌ 68.30 శాతం, పెద్దపల్లి 69.83 శాతం, రాజన్న సిరిసిల్ల 71.87 శాతం, రంగారెడ్డి 53.03 శాతం, సంగారెడ్డి 73.83 శాతం, సిద్దిపేట 77.19 శాతం, సూర్యపేట 74.88 శాతం, వికారాబాద్‌ 69.79 శాతం, వనపర్తి 72.60 శాతం, వరంగల్‌ 73.04 శాతం, యాదాద్రి భువనగిరి 78.31 శాతం.. ఇలా అన్ని జిల్లాలకు కలిపి 63.94 శాతం ఓటింగ్‌ నమోదైంది.

కాగా తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఈ రోజు 5 గంటలకు సమయం ముగిసింది. ఇప్పటికే నవంబర్ ఏడు నుంచి విడతలవారీగా మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ పూర్తయింది. వాటి తుది ఫలితాలు (Telangana Exit Poll Results 2023) వెలువడేలోపు మధ్యలో ఎగ్జిట్‌ పోల్స్‌ (Exit Poll) అంచనాలు అందరిలో ఆసక్తి కలిగిస్తాయి. ఓటింగ్‌కు ముందు ఎగ్జిట్‌ పోల్స్‌పై ఇదివరకు విధించిన నిషేధాన్ని తాజాగా ఎన్నికల సంఘం సవరించింది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ (Exit Poll Predictions) ప్రకటించవచ్చని తెలిపింది. తొలుత నవంబర్‌ ఏడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఈసీ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సమయంలో మార్పులు చేసింది. తాజాగా తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ (Exit Poll Predictions) అంచనాలు వచ్చాయి.

తెలంగాణలో రేస్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ (119)

  • బీఆర్‌ఎస్‌: 48
  • కాంగ్రెస్‌: 62
  • బీజేపీ: 3+
  • ఎంఐఎం: 6+
  • ఇతరులు: 1+ or -2

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్‌ కార్యకర్తలందరూ సంబరాలు చేసుకోవచ్చని రేవంత్‌ రెడ్డి పిలుసునిచ్చారు. కానీ బీఆర్‌ఎస్‌ మాత్రం 100 శాతం గెలిచి తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేసింది. ఎగ్జిట్‌ పోల్స్‌ మాకు వ్యతిరేకంగా ఉండటం ఇదేం తొలిసారి కాదని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. 2018లో కూడా బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని ఎగ్జిట్‌పోల్స్‌ జ్యోష్యం చెప్పాయి. కానీ ఏం జరిగింది గెలిచాం.. ఈ సారి కూడా 70కి పైగా స్థానాలతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది. డిసెంబరు 3న ఫలితాలు వచ్చాకా ఈ సర్వే సంస్థలన్నీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతాయా? అంటూ కేటీఆర్‌ కొద్ది సేపటి క్రితం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.