హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ(Telangana)లో ఎన్నికల సందడి మొదలైంది. వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయ నేతలు తలమునకలవుతున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Elections 2024) మరింత రసవత్తరంగా మారనున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. తెలంగాణలోని సీమాంధ్ర కమ్మ సామాజిక వర్గం (Kamma Community) కాంగ్రెస్కు (Congress) ఓటు వేసి గెలిపించాలని భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తెలంగాణ ఎన్నికల బరిలో ప్రత్యక్షంగా దిగకుండా కాంగ్రెస్కు మద్ధతు ఇచ్చి రేవంత్ను గెలిపించాలని కమ్మ సామాజిక వర్గం ఒత్తిడి తెస్తున్నారు. దీంతో సీమాంధ్ర కమ్మల చూపు కాంగ్రెస్ వైపుకు మళ్లుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలు కమ్మల మనోభావాలు దెబ్బతీశాయి. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే బాబుకు తిప్పలు తప్పవని, టీడీపీ (TDP) ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందని పచ్చ నేతలు సైతం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి గెలిపించాలని తెలంగాణలోని సీమాంధ్ర కమ్మ సామాజిక వర్గం భావిస్తున్నట్లు సమాచారం. ఇక జనసేన (Janasena)కు కాపు సపోర్ట్ ఎలాగూ ఉంది. ఈ మూడు పార్టీలు (Congress-TDP-Janasena) కలిస్తే విజయం తథ్యం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: TS DSC 2023 Postponed: తెలంగాణ డీఎస్సీ పరీక్ష వాయిదా.. కారణం ఇదే!
అమిత్ షా నుంచి లోకేష్కు పిలుపు
మరోవైపు అమిత్ షా నుంచి లోకేష్కు పిలుపురావడం మరింత ఆసక్తికరంగా మారింది. బాబు అరెస్ట్ తర్వాత ప్రధాని మోదీని కలవాలని ఢిల్లీకి వెళ్లిన లోకేష్కు అమిత్ షా (Amit Shah)ను కలవాలని కమలనాథులు సూచించారు. సరేనని.. అమిత్ షాను కలిసేందుకు వెళ్లిన లోకేష్ (Nara Lokesh) కు ఆయన అపాయింట్మెంట్ దొరక్క వెనుదిరగాల్సి వచ్చింది. నెల రోజులుగా లోకేష్ను కలిసేందుకు ముఖం చేటేస్తూ వచ్చిన అమిత్ షా ఇప్పుడెందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు అనే విషయం రాజకీయ విశ్లేషకుల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్తో ఆగ్రహంగా ఉన్న తెలంగాణ కమ్మ సామాజిక వర్గం కోసమే బీజేపీ దిగివచ్చిందా లేదంటే చంద్రబాబు ప్రస్తుత దుస్థితికి ఏపీ సీఎం జగన్ ఒక్కరే కారణం కాదని కేసీఆర్తోపాటు బీజేపీ కూడా కారణమన్న భావన వారిలో కలిగి ఉంటుందా? అనే గుబులు బీజేపీకి పట్టుకొందా అనే కోణంలో చర్చిస్తున్నారు. అందువల్లనే ఈసారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని తెలంగాణ కమ్మ సామాజిక వర్గం నిర్ణయించడం బీజేపీలో కలవరం పుట్టిస్తోంది. దీంతో దిగొచ్చిన బీజేపీ ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ-జనసేన (BJP-TDP-Janasena) కలిసి పోటీచేసే దిశగా పొత్తుల ప్రతిపాదనలు సాగుతున్నట్లు సమాచారం.
Also Read: Fact Check: టీవీ9 రజనీకాంత్పై నెట్టింట ట్రోలింగ్.. ‘దిస్ ఇజ్ నాట్ వాస్తవం’
మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే జరిగేది అదేనా..
గత ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) కూడా కారణమని, జగన్కు కేసీఆర్ మద్దతు ఇవ్వడం వల్ల అధికారం దక్కకపోగా ప్రస్తుత బాబు ఘోర స్థితికి కూడా కారణం అయిందన్న కడుపుమంట కమ్మ వర్గంలో బలపడింది. కేసీఆర్ ఈసారి కూడా అధికారంలోకి వస్తే బాబుకు కష్టాలు తప్పవనే అభిప్రాయం వారికి కలిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్ను ఓడించేందుకు తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని భావిస్తోంది. కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమువుతున్న తరుణంలో అనూహ్యంగా బీజేపీ పెద్దల నుంచి టీడీపీకి పిలువు వచ్చింది. తెలంగాణలో పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో పార్టీ దుస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ఈ మేరకు కాషాయం నేతలు దిగొచ్చినట్లు సమాచారం. ఇక బీజేపీ-టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే కనీసం 20 శాతం స్థానాలు గెలుచుకోవచ్చన్నది బీజేపీ అంచనా. అయితే సర్వేల ఫలితాలు మరోలా ఉన్నాయి. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్కు విజయావకాశాలు బాగానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్కు మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నట్లు వెల్లడవుతోంది. ఈ క్రమంలోనే సొంతంగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు లేవని భావించిన బీజేపీ.. కష్టాల్లో ఉన్న బాబును ఆదుకుంటే తప్ప రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగు పడదనే ప్రతిపాదన తెరమీదకి వచ్చింది.
సీమాంధ్ర కమ్మ వర్గం తమ మద్దతు కాంగ్రెస్కు ఇస్తుందా? లేదా బీజేపీకి ఇస్తుందా? అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.

Comments are closed.