TDP Anam Venkata Ramana Reddy: ‘ఢిల్లీ ఢిపెన్స్ సర్వీస్‌లో పనిచేసే ధర్మారెడ్డిని ఏ అర్హతతో టీటీడీ అధికారిగా నియమించారు?’

తిరుమల క్షేత్రాన్ని సీఎం జగన్‌, ధర్మారెడ్డి వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారు

Anam VenkataRamana Reddy Anam VenkataRamana Reddy
Share this :

TDP Anam Venkata Ramana Reddy Sensational Comments మంగళగిరి, నవంబర్‌ 16: పరమ ‘పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని (TTD) సీఎం జగన్‌హన్ రెడ్డి (CM Jagan), ధర్మారెడ్డి (Dharma Reddy) కలిసి వ్యాపార దోపిడీ కేంద్రంగా మార్చారని’ టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి (TDP Anam Venkata Ramana Reddy) మండిపడ్డారు. ఈవో ధర్మారెడ్డిని ఇటీవలే ముఖ్యమంత్రి ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ ఛార్జ్) ధర్మారెడ్డిగా మార్చాడని, ఢిల్లీలో ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌ (Delhi Defence Service)లో పనిచేస్తున్న ధర్మారెడ్డిని సీఎం జగన్ ఏరికోరి రాష్ట్రానికి తీసుకొచ్చారని అన్నారు. అసలు అతనికి టీటీడీ అధికారిగా పనిచేసే అర్హత ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం (నవంబర్ 16) ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

చదవండి: BTech Ravi Arrest: ’10 నెలల క్రితం నమోదైన కేసులో బీటెక్ రవి అరెస్టు.. సెక్షన్లు మార్చిమరీ హైడ్రామా’ ఎంపీ రఘురామ

‘గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రి అయ్యాక ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నియమించాడు. అది మొదలు రాజశేఖర్ రెడ్డి బతికున్నంతవరకు అతను అక్కడే ఆ పదవిలో కొనసాగాడు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఏడాదికి ధర్మారెడ్డి తిరిగి డిఫెన్స్ సర్వీసులకు వెళ్లిపోయాడు. డిఫెన్స్ సర్వీసు అనగానే ధర్మారెడ్డి ఏదో పెద్ద వీరసైనికుడు అనుకోకండి. డిఫెన్స్ విభాగంలో అతని పని ఏమిటంటే ఆర్మీ కంటోన్మెంట్స్ ఎక్కడుంటే అక్కడ వాటిలో పనిచేసే వాడు. ఇదే ధర్మారెడ్డి తిరిగి జగన్ సీఎం కాగానే రాష్ట్రంపై వాలిపోయాడు. ఢిల్లీలో ఉన్న ధర్మారెడ్డిని డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని జగన్ మోదీకి లేఖ రాయడం, దానికి సమాధానంగా ఏపీలో చాలామంది IAS అధికారులు ఉంటే.. ధర్మారెడ్డే ఎందుకని మోదీ ప్రశ్నించడం జరిగింది. దానికి జగన్ అతను మా మనిషి, మాకు కావాల్సిన మనిషి అని చెప్పి ధర్మారెడ్డిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం విభాగంలో పెట్టాడు’.

జగన్ రెడ్డికి తాడేపల్లిలో సజ్జల ఎంతో.. తిరుపతిలో ధర్మారెడ్డి అంత?

‘ప్రపంచ ప్రఖ్యాత అధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో ధర్మారెడ్డిని నియమించడం ఎంతవరకు సబబో ముఖ్యమంత్రి చెప్పాలి. ఐఏఎస్ అధికారులు పనిచేయాల్సిన స్థానంలో డిఫెన్స్‌లో పనిచేసే ధర్మారెడ్డిని నియమించడంపై సాటి సివిల్ సర్వీస్ అధికారులు స్పందించరా? తిరుపతికి చెందిన నవీన్ రెడ్డి వెంకటేశ్వరస్వామి ఆస్తులు..భూములు కాపాడటానికి ఎన్నోసార్లు న్యాయస్థానాల్లో పోరాడారు. అలాంటి నవీన్ రెడ్డి.. ధర్మారెడ్డి నియామకంపై ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. దానిపై జస్టిస్ పీ కృష్ణమోహన్ ధర్మారెడ్డి అర్హుడేనని, అతను టీటీడీ అధికారిగా కొనసాగవచ్చని చెప్పారు. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతో… తిరుమల లో ధర్మారెడ్డి అంత. ఢిల్లీకి చెందిన దీన్ దయాళ్ తల్వార్ 14 సెక్షన్ల కింద ధర్మారెడ్డిపై పెట్టిన కేసుల గురించి.. న్యాయస్థానం ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చిన విషయం జగన్‌కి తెలుసా..లేదా? అన్నీ తెలిసి అనర్హుడిని ఎలా టీటీడీలో కొనసాగనిస్తారు?’ అని టీడీపీ రమణారెడ్డి ప్రశ్నించారు.

చదవండి: Kerala Aluva Rape Case: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నరరూప రాక్షసుడికి ఉరిశిక్ష విధించిన హైకోర్టు

‘ధర్మారెడ్డిపై ఢిల్లీకి చెందిన దీన్ దయాళ్ తల్వార్ ఒక కేసు పెట్టారు. ధర్మారెడ్డి తనను మోసగించాడని, లంచం అడిగాడని కేసు పెట్టారు. దానిలో భాగంగా ధర్మా రెడ్డిపై తల్వార్ 14 సెక్షన్ల కింద కేసుపెట్టడం జరిగింది. దానిపై విచారించిన న్యాయస్థానం.. ధర్మారెడ్డి తప్పుచేశాడు అనడానికి ఆధారాలున్నాయని, అతనికి తక్షణమే నోటీసులు పంపాలని ఆదేశించింది. ఈ కేసువిచారణ జనవరిలో జరగనుంది. తనపై నమోదైన క్రిమినల్ కేసు గురించి తిరుమల తిరుపతి దేవస్థానం ఎఫ్ఏసీగా ఉన్న ధర్మారెడ్డి ఏపీ ప్రభుత్వానికి చెప్పాడా? తాను ఢిల్లీలో ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నానని, డబ్బుల కోసం కొందర్ని వేధించానని జగన్‌కి చెప్పాడా? ధర్మారెడ్డిపై నమోదైన క్రిమినల్ కేసుల గురించి తెలిసీ జగన్ అతనిని వదిలేశాడా? ధర్మారెడ్డిపై నమోదైన కేసుల విచారణ తేలేవరకు.. తీర్పు వచ్చేవరకు అతన్ని టీటీడీ నుంచి తప్పించాలని మేం డిమాండ్ చేస్తున్నామని’ ఆయన ((TDP Anam Venkata Ramana Reddy)) అన్నారు.

ధర్మారెడ్డిని ఈవోగా నియమిస్తే న్యాయస్థానాల్లో మొట్టికాయలు పడతాయని జగన్, సజ్జలకు తెలుసు!

‘ధర్మారెడ్డి టీటీడీలో కొనసాగవచ్చని గతంలో ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ తీర్పు ఇచ్చినప్పటికీ, అతన్ని నేటికీ ఎందుకు పూర్తిస్థాయి ఈవోగా నియమించలేదు? ఫుల్ అడిషనల్ ఛార్జ్.. హాఫ్ అడిషనల్ ఛార్జ్ అంటూ అర్థం పర్థం లేని పదవిలో ఎందుకు కొనసాగనిస్తున్నారు. ధర్మారెడ్డిని ఈవోని చేస్తే న్యాయస్థానాల్లో తమకు, తమ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగులుతుందని జగన్ రెడ్డికి, సజ్జలకు బాగా తెలుసు. తిరుపతి కార్పొరేషన్ (తుడా) సొమ్ముతో చేయాల్సిన అభివృద్ధి పనులకు టీటీడీ సొమ్ము వినియోగిస్తారా? తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వరస్వామి సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నాడు.

రూ.450కోట్ల వ్యయంతో టీడీపీ ప్రభుత్వంలో తిరుపతిలో గరుడవారధి నిర్మాణం ప్రారంభించారు. అది ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తయింది. టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి స్వామివారి సొమ్మును తన కుమారుడు అభినవ్ రెడ్డి ఎన్నికల కోసం ఖర్చుపెడుతున్నాడు. తిరుపతి కార్పొరేషన్ (తుడా) వేయాల్సిన రోడ్లను వెంకటేశ్వరస్వామి సొమ్ముతో వేసే అధికారం భూమనకు ఎవరిచ్చారు. అభినవ్ రెడ్డి రాజకీయ జీవితం కోసం రూ.150కోట్లతో తిరుపతిలో ఇంటర్నల్ రోడ్లు వేస్తారా? ఈ విధంగా కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకు స్వామివారికి సంబంధించిన ఎంత సొమ్ముని ఇలా దారిమళ్లించాడో చెప్పాలి. స్వామివారి సొమ్మును తమ సొంత పనులకు వినియోగించడమే తప్పయితే, ఆ పనుల్లో మరల కరుణాకర్ రెడ్డి 10శాతం కమీషన్లు తీసుకుంటున్నాడు. అందుకే తిరుపతిలో అందరూ ఆయన్ని 10 శాతం కమీషన్ల కరుణాకర్ రెడ్డి అంటున్నారు’.

చదవండి: Kerala Aluva Rape Case: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నరరూప రాక్షసుడికి ఉరిశిక్ష విధించిన హైకోర్టు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలనుకున్న ప్రాంతంలో భూమన అభినయ్ రెడ్డికి భూమి ఎలా వచ్చింది?

‘టీటీడీ ఉద్యోగులకు వడమాలపేట ప్రాంతంలో ఇళ్లస్థలాలు ఇవ్వాలని టీటీడీ విభాగం భావించింది. ఆ నిర్ణయం మంచిదే కానీ, అదే ప్రాంతంలో ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ఇచ్చే ఇళ్లస్థలాల మధ్యలో భూమన అభినయ్ రెడ్డికి 5 ఎకరాల భూమి ఎక్కడినుంచి వచ్చిందో కరుణాకర్ రెడ్డి చెప్పాలి. (అభినయ్ రెడ్డి పేరుతో ఉన్న భూమి తాలూకా అడంగల్ కాపీ ఇతర వివరాలను వెంకట రమణారెడ్డి విలేకరులకు చూపించారు) కలియుగదైవం వెంకటేశ్వరస్వామి విషయంలో చేసే ప్రతి తప్పు, వారిపాలిట పెద్ద ముప్పుగా మారి జగన్ రెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలను కచ్చితంగా శిక్షిస్తుంది. ధర్మారెడ్డి చేసే ప్రతి తప్పుడు పనిని ప్రజల్లోపెట్టి.. అతను శాశ్వతంగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉండేలా చేస్తాం’.

జగన్ రెడ్డి మిత్రులైతే టీటీడీ సభ్యులు అయిపోతారా?

‘పొట్టి సారాయి రెడ్డి అలియాస్ ఏ-2 విజయసాయిరెడ్డి అల్లుడైన పినాక శరత్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎలా నియమించారు? అతను ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో బాగా సంపాదించాడని.. అతన్ని టీటీడీ సభ్యుడిగా నియమించారా? డాక్టర్ కేతన్ దేశాయ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఉండి అవినీతికి పాల్పడ్డాడని గతంలో రాష్ట్రపతి ప్రతిభాభారతి అతనిపై చర్యలు తీసుకు న్నారు. అతనిపై సీబీఐ విచారణలు కూడా జరిగాయి. అలాంటి వ్యక్తిని జగన్ టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించాడు. జగన్ రెడ్డి ఏలుబడిలో టీటీడీ సభ్యులు కావాలంటే ఒకటి కోటీశ్వరులు అయినా అయ్యిండాలి..లేదా స్కామ్ లైనా చేసి ఉండాలి. గజదొంగలైనా అవ్వాలి. లేదా జగన్ రెడ్డితో వ్యాపార లావాదేవీ లైనా ఉండాలి. ఈ విధానం ఎంతమాత్రం సరైంది కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై టీడీపీప్రభుత్వం రాగానే విచారణ జరిపించి, తప్పుచేసిన వారిని కచ్చితంగా న్యాయస్థానాల్లో నిలబెడుతుంది’ అని ఆనం వెంకట రమణా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.