చెన్నై, అక్టోబర్ 25: తమిళనాడు (Tamil Nadu)లో బీజేపీ (BJP) బలపడుతుందనుకుంటున్న సమయంలో వరుస షాక్లు ఎదురవుతున్నాయి. బీజేపీలో కీలకంగా ఉంటున్న నటి గౌతమి బీజేపీకి గుడ్బై (Gautami Tadimalla Quits BJP) చెప్పిన సంగతి తెలిసిందే. గౌతమి పార్టీని వీడడం వెనుక అంతర్గత శక్తుల కుట్ర ఉందనేది ఆమె స్వయంగా తన ట్విటర్ ఖాతాలో లేఖ రాసి పోస్టు చేశారు కూడా. బలమైన కారణాలు ఉన్నాయని బీజేపీలోని కొందరు నేతలే చెబుతుండడం విశేషం. పార్టీలో గౌతమి (Gautami Tadimalla) ఎదుగుదలకు పదేపదే కొందరు అడ్డుపడ్డారు అనేది కూడా చాలామంది చెబుతున్న మాట. గౌతమి పార్టీని వీడిన తర్వాత తమిళనాడు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ నుంచి వరుసగా కీలక నేతలందరూ దూరమవుతుండటం.. అవన్నీ గౌతమి రాజీనామా (resignation) తర్వాత చర్చకు రావడం తమిళ రాజకీయాల్లో కీలకంగా మారింది. నటి గాయత్రి రఘురామ్ (Actor Gayathri Raguram) చాలా కాలంగా బీజేపీలో కీలకంగా పనిచేస్తున్నారు. పార్టీలో కొందరు నేతల వైఖరి నచ్చక తాజాగా ఆమె కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. గాయత్రి రాజీనామా చేయక ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండా తనపై వేటు వేయడాన్ని కూడా గాయత్రి తప్పుబట్టారు. ఇక బీజేపీలో సుదీర్ఘంగా పని చేసిన CTR నిర్మల్ కుమార్ కూడా పార్టీకి ఈ మధ్యనే రాజీనామా చేశారు.
A journey of 25 yrs comes to a conclusion today. My resignation letter. @JPNadda @annamalai_k @BJP4India @BJP4TamilNadu pic.twitter.com/NzHCkIzEfD
— Gautami Tadimalla (@gautamitads) October 23, 2023
BJP తమిళనాడు సోషల్ మీడియా చీఫ్గా పనిచేసిన నిర్మల్ కుమార్ పార్టీని వీడారు. నిన్నటి వరకు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ఏడీఎంకే లో చేరారు. తమిళనాడులో జిల్లాల నుంచి 13 మంది సీనియర్లు బీజేపీకి దూరమయ్యారు. ఇక పార్టీలో అసంతృప్తుల జాబితా చాలానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గంగై అమరన్ దశబ్దానికి పైగా బీజేపీలో ఉంటున్నారు. తనకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా అవమానాలు భరించాల్సి వస్తోందని ఆయన సన్నిహితులు చెబుతున్న మాట.
ఇక తమిళనాడులో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు బీజేపీ నుంచి గెలుపొందారు. బీజేపీ లాంటి పార్టీ తమిళనాడు అసెంబ్లీలో గెలవడం సాధారణ విషయం కాదు. ద్రవిడ సిద్ధాంతాలు బలంగా ప్రభావం చూపే తమిళ గడ్డపై బీజేపీ ప్రాతినిధ్యం ప్రత్యేకమనే చెప్పాలి. అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ నుంచి తమకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, పార్టీ అధ్యక్షుడు అన్నామలై తర్వాత చెప్పుకోదగ్గ మరో నేత లేరు అన్నట్లుగా పరిస్థితి ఉందని సీనియర్లు చెబుతున్న మాట.
నటి గౌతమి.. అంతక ముందు గాయత్రి రఘురామ్, CTR నిర్మల్ కుమార్.. ఇలా అనేకమంది నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేయడం గత ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండడానికి కారణమైన ఎండీఎంకేతో పొత్తు రద్దవడం పార్టీ నేతల్లో ఆందోళన పెంచుతోంది. తమిళనాడులో పార్టీ చిన్నగా బలపడుతోంది అనుకుంటుండగా ఇలా వరుస రాజీనామాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందులోనూ త్వరలోనే లోక్సభ ఎన్నికలు రానున్నాయి. దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో కనీస ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్న ఆపార్టీ అగ్రనేతల అభిప్రాయాలకు ఇక్కడ పరిస్థితులు మింగుడు పడని అంశంగా ఉంది.
