AP Fake Votes List మంగళగిరి, నవంబర్ 15: రాష్ట్రంలో 3 నెలల్లో ఎన్నికలు (AP elections 2024) రానున్న తరుణంలో దొంగఓట్లు అటు ప్రజల్ని, ఇటు రాజకీయ పార్టీలను కలవరపెడుతున్నాయి. సెప్టెంబర్ నాటికి రాష్ట్ర (Andhra Pradesh)వ్యాప్తంగా 10మంది అంత కంటే ఎక్కువ కుటుంబ సభ్యులున్న ఇళ్లు సంఖ్య 1,57,939 ఉంటే, వాటిలో 24,61,676 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనే చెప్పింది. వాటిలో 2,51,767 మంది ఓటర్ల ఇంటినంబర్లు సున్నాలు, జంక్ నంబర్లు ఉండటం, మరికొన్ని అర్థంకాని విధంగా ఉన్నాయని టీడీపీ (TDP) అధికారప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ (Nilayapalem Vijay Kumar) తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..
‘సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలో ఉన్న దొంగఓట్లలో 20శాతం ఓట్లను సరిచేశామని ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించింది. మిగిలిన వాటి సంగతేమిటన్నదే ఇప్పుడు భేతాళప్రశ్నగా మారింది. 1,57,939 ఇళ్లలో 20శాతం సరిచేసినట్టు రాష్ట్ర ఎన్ని కల కమిషనర్ చెబుతున్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో దొంగఓట్లు నమోదు కావడం.. అధికారులు సస్పెండ్ కావడం అనేవి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో దొంగఓట్ల (AP Fake Votes) నమోదుకు గల కారణాలు ఏమిటా అని ఆలోచిస్తే … విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.
చదవండి: MP Raghu Rama Krishna Raju: ‘సీఎం జగన్ గాలి తిరుగుళ్ళు ఆపి.. నేల తిరుగుళ్ళు తిరగాలి’.. ఎంపీ రఘురామ
కొంతమంది వ్యక్తులు దొంగ ఓట్లు నమోదు వెనుక ఉన్నారు. ప్రభుత్వ డేటా వ్యక్తులకు చేరుతోంది.. ఒక్క మాటలో చెప్పాలంటే దొంగ ఓట్ల బాగోతంలో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం సీఎం జగన్దే. ప్రభుత్వం, రాజకీయపార్టీ, ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ కలిసి చేస్తున్న నిర్వాకాల ఫలితమే యథేచ్ఛగా జరుగుతున్న దొంగఓట్ల నమోదు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగఓట్ల నమోదు అనేది జగన్ పాలనలోనే జరుగుతోంది. రామ్ ఇన్ఫో సంస్థ ముసుగులో ఐప్యాక్ సంస్థే వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి దొంగఓట్ల తంతులో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అంటే జూన్ 22న ప్రత్యేకంగా జీవో ఇచ్చి మరీ (జీవో ఎంఎస్-104) వాలంటీర్లను నియమించాడు. పంచాయతీరాజ్.. గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్ని నామమాత్రానికే పరిమితం చేస్తూ, 2.60లక్షల పైచిలుకు వాలంటీర్లను జగన్ సర్కార్ నియమించింది. వాలంటీర్లు అందరూ మనవాళ్లే (వైసీపీవారే) అని స్వయంగా మంత్రులే పలు సందర్భాల్లో చెప్పారు. వాలంటీర్ వ్యవస్థను పర్యవేక్షించడానికి డిసెంబర్ 23, 2019న ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నలాజికల్ సర్వీసెస్) తరుపున ఒక లెటర్ ఆఫ్ అవార్డ్ ఇవ్వడం జరిగింది.
అసలు వాలంటీర్లు ఏ డిపార్ట్మెంట్ కిందకు వస్తారో కూడా అప్పటికి నిర్ణయం కాకుండానే వాళ్ళను మానిటరింగ్ చేయడానికి ‘మూడు సంస్థల ప్రైవేటు కన్సార్షియం’ కు ఏపీటీఎస్ కాంట్రాక్ట్ లెటర్ ఇచ్చేసింది. గ్రామ, వార్డు వాలంటీర్… సచివాలయ వ్యవస్థల పర్యవేక్షణను ప్రభుత్వం ఎఫ్ఓఏ (మూడుసంస్థల ప్రైవేట్ కన్సార్టియం) పరిధిలోకి చేర్చింది. ఎఫ్ఓఏ అంటే రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్, మ్యాక్స్ ఇన్ఫో డిటెక్టివ్ సర్వీసెస్ సంస్థ కలయిక. ఒక డిటెక్టివ్ సంస్థ ఎఫ్ఓఏలోకి ఎందుకొచ్చిందనేది నేటికీ సందేహమే. ఎఫ్ఓఏని లీడ్ చేసే రామ్ ఇన్ఫో సంస్థకు అనుబంధంగా మండల, గ్రామ అధికారులు కలిసి పనిచేయాలని నేరుగా జిల్లా జాయింట్ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులివ్వలేదు.
చదవండి: Actor Chandra Mohan Passes away: ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత..!
రామ్ ఇన్ఫో సంస్థకు చెందిన ఉద్యోగులంతా గతంలో ఐప్యాక్ లో పనిచేసినవారేనని చెప్పడానికి కూడా అనేక ఆధారాలున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను ఐప్యాక్ లింక్డ్ ఇన్ సమాచారంతో తెలుగుదేశం గతంలోనే ప్రజల ముందు ఉంచింది. ఆ విధంగా ఒక ప్రైవేట్ సంస్థను నేరుగా ప్రభుత్వ యంత్రాంగం కార్యకలాపాల్లో జోక్యం చేసుకునేలా చేశారు. రామ్ ఇన్ఫో అనే సంస్థ కేవలం ముసుగు సంస్థ మాత్రమే.. దాని వెనకుండి నడిపించేది రాజకీయ కన్సల్టింగ్ సంస్థ అయిన ఐప్యాక్ సంస్థ. ఈ ఐప్యాక్ సంస్థ కార్యకలాపాల కోసం రాష్ట్రప్రభుత్వమే ఏడాదికి రూ.68 కోట్లు చెల్లిస్తోంది. జూన్ 2021న మరలా ప్రభుత్వం పోస్ట్ డిఫ్యాక్టో జీవో ఇచ్చింది. 2019లో ఐప్యాక్ పరిధిలో వాలంటీర్లు పనిచేసేలా చేసిన ప్రభుత్వం ఆ సమయంలో… ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, ఐప్యాక్ సిబ్బందికి అందించారు.
రామ్ ఇన్ఫో వెబ్ సైట్లోని సమాచా రం ప్రకారం ప్రభుత్వం నేరుగా 1061 మంది ఐప్యాక్ సిబ్బందిని నేరుగా ప్రభుత్వ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేలా చేసింది. ఇదంతా రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందే. ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వం ద్వారా జరిగే సమాచార సేకరణ ప్రక్రియలో నేరుగా పాల్గొనేలా ఉత్తర్వులివ్వడం జరిగింది. ఇలా సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం గుప్పెట్లో పెట్టుకున్న ఐప్యాక్ సంస్థ, ఓట్ల నమోదు, తొలగింపు దొంగఓట్లపై దృష్టిపెట్టింది. ఈ విధంగా నాలుగేళ్లుగా ప్రభుత్వం చాలా నింపాదిగా.. ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా దొంగఓట్లు నమోదుచేసింది. తిరుపతిలో, విశాఖపట్నం జిల్లాలో వేలసంఖ్యలో దొంగఓట్లు నమోదయ్యాయి. ఇంత జరుగుతున్నా సివిల్ సర్వెంట్స్ చూస్తూ ఊరుకోవడం విచారకరమని విజయ్ కుమార్ అన్నారు.
టీడీపీ చూస్తూ ఊరుకోదు..
ఐప్యాక్ సంస్థ సాయంతో నేరుగా జగన్ సర్కారే దొంగఓట్ల నమోదు అనే బృహత్తర కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనిపై తొలుత కఠినంగా వ్యవహరించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ క్రమేణా కాస్త మెత్తబడింది. ఓటర్ జాబితా పరిశీలన సహా, ఎన్నికల విధుల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చేస్తామని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. జగన్ ను తిరిగి ఎందుకు ఎన్నుకోవాలి అనేఅంశంపై వాలంటీర్లు ఇప్పుడు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా ఓట్లు తీసేయడం.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రజల హక్కులు, స్వేఛ్ఛను హరించే చర్యలకు పాల్పడుతుంటే టీడీపీ సహించదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టాలి వాలంటీర్లు.. సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి. తక్షణమే మొత్తం ఓటర్ల వివరాలతో శ్వేతపత్రం విడుదలచేయాలంటూ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ఇంకా మూడునెలల సమయమే ఉన్నందున రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే యుద్ధప్రాతిపదికన దొంగఓట్ల తొలగింపుపై దృష్టిపెట్టాలన్నారు. జనవరిలో తుదిఓటర్ల జాబితా విడుదలయ్యే సమయానికి రాష్ట్రంలో ఒక్క దొంగ ఓటు కూడా ఉండటానికి వీల్లేదని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటుహక్కు హరించేలా చేస్తున్న ఏ కార్యక్రమాన్ని టీడీపీ కొనసాగనివ్వదని తేల్చి చెప్పారు.

Comments are closed.