అమరావతి, నవంబర్ 1: టీడీపీ (TDP) అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra babu Naidu) మధ్యంతర బెయిల్పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలైన ఆయనకు ప్రజలు స్వాగతం పలికేందుకు పోటెత్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రఘురామకృష్ణం రాజు (Narasapuram MP Raghu Rama Krishna Raju) అన్నారు. రాజమండ్రి (Rajamandry) నుంచి రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలోని ఆయన నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టిందంటే, ఎంతగా జనం నీరాజనం పట్టారో ఇట్టే అర్థమవుతుందన్నారు. 1982లో ఎన్టీ రామారావు ను తిలకించడానికి రోడ్డు పక్కనే జనం పడుకొని ఉండేవారట. జైలు నుంచి బెయిల్ (Bail) పై విడుదలై వస్తున్నా చంద్రబాబు (Nara Chandra Babu Naidu)ని కూడా అదేమాదిరి చూసేందుకు ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నారు. చంద్రబాబు రాగానే ఆయనకు స్వాగతం పలికేందుకు కొన్ని చోట్ల రోడ్డు పక్కనే జనాలు పడుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికిన వారిలో టీడీపీ, జనసేన కార్యకర్తలతో పాటు వైకాపా (YSRCP) నాయకత్వంతో విసుగెత్తిపోయిన నాలాంటి వారు కూడా ఉన్నట్లుగా కనిపించింది. చంద్రబాబుపై అభిమానంతోమాత్రమేకాదు. ఇప్పుడున్న ప్రభుత్వంపై ద్వేషంతో, కోపంతో, అసహ్యంతో ప్రజలు రోడెక్కారని రఘురామకృష్ణం రాజు అన్నారు .

చంద్రబాబు జన్మ ధన్యమైందన్నారు. మంచి చేస్తే ఒక వ్యక్తిని ప్రజలు ఎంతగా ఆరాధిస్తారో చంద్రబాబుకు స్వాగతం పలికిన ప్రజలను చూస్తే అర్థమయిందన్నారు. రాజకీయాలు అనేవి థ్యాంక్స్ లెస్ జాబ్స్ అని అంటారు. కానీ మంచి చేస్తే అదే ప్రజలు బ్రహ్మరథం పడతారని స్పష్టమయ్యింది. 52 రోజులపాటు జైల్లో ఉన్న చంద్రబాబు, తన 45 సంవత్సరాల ప్రజా జీవితంలో, ప్రజలకు చేసిన మంచిని విస్తృత స్థాయిలో చర్చించుకునే విధంగా చేసిన సీఎం జగన్ను అభినందించాల్సిందేనని ఎద్దేవా చేశారు. జగన్ ఒకటనుకుంటే మరొకటి జరిగింది. వామనడు చిన్నవాడే కదా అని మూడు అడుగుల స్థలాన్ని ఇస్తే బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కినట్లుగా… జనాలను బలిచ్చే ఈ అభినవ బలి చక్రవర్తిని ప్రజలు తమ పాదాలతో తొక్కి వేస్తారేమోనని రఘురామ అన్నారు.
కోర్టు తీర్పు అనుసరించే పెనాల్టీని రద్దు చేస్తే కేసులు పెడతారా?
ఇండస్ట్రియల్ ప్రమోషన్లో భాగంగా కోర్టు తీర్పును అనుసరించి ఎస్పీవై రెడ్డి కంపెనీపై విధించిన పన్నును రద్దు చేస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ రఘు ప్రశ్నించారు. కార్బోహైడ్రేడ్స్ నుంచి ఆల్కహాల్ ఉత్పత్తి చేసే కంపెనీని ఎస్పీవై రెడ్డి ప్రారంభించారు. ఈ కంపెనీపై విధించిన పెనాల్టీని గత ప్రభుత్వ హయాంలో వేవ్ చేశారు. కంపెనీలపై పెనాల్టీలు పడినప్పుడు వేవ్ చేయడం సహజం. ఈ కేసులో అప్పుడు విధులు నిర్వహించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినప్పటికీ, పరోక్షంగా ఆయన్ని భయపెట్టడానికి జమోరె అండ్ గ్యాంగ్ వేసిన ఎత్తుగడేనని ఆయన అన్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర కమిషనర్గా ఆయన వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయినా న్యాయస్థానం ముందు ఈ కేసు 5 నిమిషాలు కూడా నిలబడదు. మద్యం ద్వారా ఏడాదికి 30 వేల కోట్ల రూపాయలకు కన్నాలు వేస్తూ, తగుదనమ్మా అంటూ రివర్స్లో మద్యం కుంభకోణం జరిగిందని కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అడాన్ డిస్టలరీస్ ఎవరిది?, వారు ఎంత సరుకు అమ్ముతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam)లో అడాన్ డిస్టలరీస్ యజమాని అప్రూవర్ గా మారిన మాట నిజం కాదా??. పారదర్శకంగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి అధికారి నగేష్ పై కేసు పెట్టడం విడ్డూరంగా ఉంది. దొంగ ఓట్లు నమోదు చేయాలనుకున్న వైసీపీ నాయకుడు ముఖేష్ కుమార్ మీనా అడ్డంకులను సృష్టించడం వల్లనే ఆయనకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు భయపెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ కేసు విచారణ 20వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా 28వ తేదీ వరకు చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయబోమంటూ అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ఈనెల 7వ తేదీ తర్వాత చంద్రబాబుని టచ్ చేసే పరిస్థితి ఉండదు. చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు (Skill Development Scam)లో అవినీతి నిరోధక చట్టంలోని 17A నిబంధన వర్తిస్తుందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.
విడ్డూరంగా మంత్రి అంబటి రాంబాబు, మిల్లెట్ రెడ్డి వ్యాఖ్యలు..
చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ లభించిన వెంటనే, హైకోర్టు (high Court) న్యాయమూర్తి వద్దకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వెళ్లి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారని తెలిసింది. దీనితో న్యాయమూర్తి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు తనకు తెలుసునని, ఈ కేసులో అవసరమైతే సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్ళమని సూచించినట్లుగా సమాచారం అందిందని రఘురామ తెలిపారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరి అనంతరం షరతులను విధించడం పరిశీలిస్తే, వైసీపీ నాయకత్వం ఎంత ఆత్మరక్షణలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. చంద్రబాబు మీడియా సమావేశంలో పాల్గొంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ప్రగల్బాలు పలికిన వారికి 17 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని భయం పట్టుకుంది. నిజంగానే 175 స్థానాలకు 175 స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటే… ఏమి మాట్లాడుతారో మాట్లాడుకోవాలని అని ఉండేవారు. చంద్రబాబుపై విధించిన కేసులకు ఎలాంటి సాక్ష్యం లేదు. చంద్రబాబు బెయిల్ (Bail to Chandrababu)పై విడుదల తర్వాత మంత్రి అంబటి రాంబాబు, మిల్లెట్ రెడ్డి వంటి వారు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. జగన్ గత పదేళ్లుగా బెయిల్ పైనే ఉన్న విషయాన్ని విస్మరించడం విడ్డూరంగా ఉందన్నారు.
నాకేదైనా జరిగితే ఆ ముగ్గురిదే బాధ్యత… ప్రధానికి రఘురామ లేఖ
నాకు ఏదైనా జరిగితే సీఎం జగన్తో పాటు ఆయన పక్కనే ఉండే ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులదే బాధ్యత అని రఘురామ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి (PM Modi) లేఖ రాసినట్లు తెలిపారు. గతంలో లాకప్లో హత్య చేయాలని చూశారని, దేవుడి దయ వల్ల బ్రతికి బయటపడ్డానన్నారు. ఇప్పటికీ నాపై తప్పుడు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. పార్లమెంట్ కమిటీ విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానిని కోరారు. అనంతరం ఋషికొండ (Rushikonda)పై నిర్మాణాల గురించి మాట్లాడుతూ.. ఋషికొండపై భవన నిర్మాణాలలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల సీఎం జగన్ ఉల్లంఘించారన్నారు. తన తరపు న్యాయవాది, సివిల్ ఇంజనీర్కు శని, ఆదివారాల్లో పరిశీలించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ టూరిజం శాఖ ఎండీ కన్నబాబుకు లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఋషికొండ పై నిర్మాణాలలో ఉల్లంఘనలను పరిశీలించి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందన్న ఆయన, తన తరపు న్యాయవాది, సివిల్ ఇంజనీర్ ను పరిశీలించడానికి అనుమతించాలని కోరారు. అనుమతి ఇస్తే సరే సరే.. లేకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తానన్నారు.

Comments are closed.