హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ (Telangana)లో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మొదటి అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions)ప్రారంభమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యేలు (MLA’s), మంత్రుల (Minister’s)తో ప్రమాణస్వీకారం అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రాసెస్ జరుగుతుంది. దాని కంటే ముందుగా గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్ (Pro-tem Speaker)తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అసలు ప్రొటెం స్పీకర్ని ఎందుకు ఎన్నుకుంటారు? ఎవరిని ఎన్నుకుంటారు? అనే విషయం చాలా మందికి తెలియదు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న మొదటి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం, స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ముందుగా రాజ్ భవన్లో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ (AIMIM Chief Akbaruddin Owaisi)చే ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు నుంచి ప్రొటెం స్పీకర్ చాలా కీలక బాధ్యతలను వ్యవహరిస్తారు.
ప్రొటెం స్పీకర్ అంటే ఎవరు? వారి బాధ్యతలు ఏమిటి?
ప్రొటెం స్పీకర్ అంటే తాత్కాలికంగా నియమించబడిన స్పీకర్ అని అర్థం. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలంటే ఛైర్ పర్సన్ గా స్పీకర్ చాలా కీలకం కాబట్టి ఆ సమావేశాలను నిర్వహించటానికి రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్నినిర్వహిస్తారు. ఆ తర్వాత స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల నియామకానికి సంబంధించి దరఖాస్తు కార్యక్రమం ఉంటుంది. Houseలో ఎక్కువమంది బలపరిచిన వ్యక్తిని స్పీకర్గా ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన వ్యక్తిచేత స్పీకర్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా ప్రొటెం స్పీకర్ సమక్షంలోనే జరుగుతుంది.
ఈ కార్యక్రమం అంతా పూర్తి కావటానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. దాంతో ప్రొటెం స్పీకర్ బాధ్యత ముగిసిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి అసెంబ్లీ చైర్పర్సన్ గా స్పీకర్ సభా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే ప్రొటెం స్పీకర్ ని ఎన్నుకోవడానికి కొన్ని నియమాలు ఉంటాయి. సాధారణంగా house లో సీనియర్ మోస్ట్ మెంబర్ ప్రొటెమ్ స్పీకర్గా ఎన్నుకొవడానికి అర్హులు. ఒకవేళ houseలో ఉన్న ఎమ్మెల్యేలకు సమానమైన అర్హత కలిగి ఉంటే అందులో నుంచి ఒకరిని ప్రొటెమ్ స్పీకర్గా ప్రమాణం చేయిస్తారు.
లోపాయికారి ఒప్పందం ప్రకారమే మజ్లిస్ ప్రొటెం స్పీకర్: కిషన్రెడ్డి
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే శనివారం (డిసెంబర్ 9) ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ను ఎంపిక చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసిందన్నారు. మజ్లిస్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్ను చేసిందని మండిపడ్డారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నేడు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరన్నారు. ఈ అంశంపై గవర్నర్కు కూడా ఫిర్యాదు చేస్తామని, స్పీకర్ ఎన్నికను ఆపాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా.. దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోందంటూ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
కాగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ 78వ పుట్టిన రోజు వేడుకలను గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 78 కిలోల కేకును పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావుతో సీఎం రేవంత్ కట్ చేయించారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.
