భారత్ తో పాటు ఆగ్నేయాసియా దేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి పునాది పడింది. ప్రముఖ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ‘లైట్స్టార్మ్’ (Lightstorm) ఆధ్వర్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, సింగ్టెల్ మరియు టాటా కమ్యూనికేషన్స్ చేతులు కలిపాయి. ఇండియా – సౌత్ ఈస్ట్ ఏషియా కారిడార్ను అనుసంధానిస్తూ ‘I-2SEA’ పేరుతో ఒక సరికొత్త సబ్మెరైన్ కేబుల్ (సముద్ర గర్భ కేబుల్) వ్యవస్థ నిర్మాణానికి అధికారిక ఒప్పందాలు జరిగాయి. ఇది సాధారణ ఇంటర్నెట్ కేబుల్ కాదు.
పూర్తిగా AI అప్లికేషన్లు, GPU ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హైపర్స్కేలర్ డేటా సెంటర్ల భారీ అవసరాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన అత్యాధునిక నెట్వర్క్. దాదాపు 3,600 కిలోమీటర్ల పొడవుండే ఈ సబ్సీ కేబుల్.. సింగపూర్, మలేషియా (కౌలాలంపూర్) దేశాలను నేరుగా భారత తూర్పు తీరంతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భారతదేశంలో రెండు చోట్ల ప్రధాన ల్యాండింగ్ స్టేషన్లను నిర్మిస్తున్నారు.
మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్): ఇక్కడి నుంచే హైదరాబాద్లోని అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్లకు అత్యంత వేగవంతమైన, తక్కువ ల్యాటెన్సీ (Latency) గల కనెక్టివిటీ లభిస్తుంది.
సౌత్ చెన్నై (తమిళనాడు): రెండవ ల్యాండింగ్ పాయింట్గా ఇది సేవలందిస్తుంది.
ఈ కేబుల్ ద్వారా లైట్స్టార్మ్ సంస్థకు చెందిన 30,000 కిలోమీటర్ల దేశీయ నెట్వర్క్ సహాయంతో హైదరాబాద్, ముంబై సహా దేశవ్యాప్తంగా ఉన్న 80కి పైగా డేటా సెంటర్లకు నిరంతరాయంగా డేటా సరఫరా జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను గ్లోబల్ టెక్నాలజీ లీడర్ ‘NEC కార్పొరేషన్’ చేపట్టగా, సముద్రంలో కేబుల్ అమర్చే పనులను ‘ASEAN కేబుల్షిప్’ సంస్థ పర్యవేక్షిస్తుంది. సముద్ర గర్భంలో 3 మీటర్ల లోతులో ఈ కేబుళ్లను పాతిపెట్టడం ద్వారా వీటికి గరిష్ట భద్రత లభిస్తుంది. ఈ భారీ ప్రాజెక్టు 2029 చివరి త్రైమాసికంలో (Q4 2029) అందుబాటులోకి రానుంది. ఇది పూర్తయితే భారత్-సింగపూర్ మధ్య AI డేటా రవాణాలో సరికొత్త రికార్డులు నమోదు కావడం ఖాయం.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి