ఆ మేఘాలు ఎక్కడ..? భయపెడుతోన్న శాటిలైట్ ఫోటోలు..!

దేశంలో వానలు కరువు

Share this :

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి, ముసురు వానలతో అల్లాడించిన రోజులు గడిచి వారం కూడా కాలేదు.. అప్పుడే వాతావరణంలో ఊహించని మార్పు వచ్చింది. జులై నెల మధ్యలో కుండపోత వర్షాలతో తడవాల్సిన భారతదేశం ఒక్కసారిగా మూగబోయింది. తాజాగా అందిన శాటిలైట్ చిత్రాలు దేశంలో విచిత్రమైన పరిస్థితిని చూపిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని సుమారు 70 నుంచి 80 శాతం భూభాగంపై ఎలాంటి వాన మబ్బుల (Cloud cover) ఆనవాళ్లు లేవు. దీంతో దేశంలోని అత్యధిక ప్రాంతాలలో వర్షాలు పూర్తిగా తగ్గిపోయి, పొడి వాతావరణం ఏర్పడింది.

Also Read: వైభవ్ సూర్యవంశీపై ప్రయోగం బెడిసికొట్టిందా..?

భారత్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి కారణమయ్యే నైరుతి రుతుపవనాల ద్రోణి (Monsoon trough) ఒక్కసారిగా బలహీనపడింది. అయితే, ఈ మార్పునకు కారణం ఇక్కడ లేదు.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో దాగి ఉంది. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం ఒక అత్యంత శక్తివంతమైన ఉష్ణమండల తుఫాను (Tropical Cyclone) కేంద్రీకృతమైంది. ఈ శక్తివంతమైన తుఫాను.. హిందూ మహాసముద్రం నుండి భారతదేశం వైపు రావలసిన తేమతో కూడిన గాలులను, వాతావరణ వ్యవస్థలను తన వైపునకు లాగేసుకుంటోంది. దీనివల్ల భారత ఉపఖండంలో రుతుపవనాల తీవ్రత తగ్గి, వర్షాలు ముఖం చాటేశాయి.

భారత వాతావరణ శాఖ (IMD) నివేదికల ప్రకారం.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రయాణం ఏమాత్రం సాఫీగా సాగడం లేదు. జూన్ నెల ముగిసే సమయానికి దేశంలో దాదాపు 40 శాతం వర్షపాత లోటు నమోదైంది. అయితే, జూన్ చివరి వారంలో, జులై మొదటి వారంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ లోటు 14 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ, వర్షాల విస్తరణ సమానంగా లేదు. పశ్చిమ, తూర్పు భారత ప్రాంతాలు మంచి వర్షాలను పొందినా.. మధ్య భారతదేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికీ తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి.

Also Read: వైభవ్ సూర్యవంశీపై ప్రయోగం బెడిసికొట్టిందా..?

రానున్న కొన్ని రోజుల పాటు మధ్య భారతదేశం, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాలలో వర్షాల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఐఎండీ (IMD) అంచనా వేసింది. జులై నెలలో మిగిలిన రోజుల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదు కానుంది (దాదాపు 94 శాతం కంటే తక్కువ). దీనికి తోడు, భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావంపై కూడా శాస్త్రవేత్తలు నిఘా పెట్టారు. ఇది రుతుపవనాల చివరి దశను మరింత బలహీనపరిచే ప్రమాదం ఉంది. మరోసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికైతే రుతుపవనాలు దేశం నుండి పూర్తిగా మాయమవ్వలేదు, కేవలం బలహీనమైన దశలోకి మాత్రమే ప్రవేశించాయని నిపుణులు చెప్తున్నారు.

leave a reply