మరోసారి టార్గెట్ అయిన గంభీర్..!

భారత జట్టుకు ఊహించని షాక్

Share this :

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా క్లీన్‌స్వీప్‌కు గురైంది. పసికూన చేతిలో భారత్ దారుణంగా ఓడిపోవడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు మరియు టీమ్ సెలెక్షన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శకులు విరుచుకుపడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఇవ్వడం దగ్గర నుంచి గంభీర్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also Read: సాయికృష్ణ కేసులో వైసీపీ సడన్ సైలెన్స్..?

టీమిండియా ఓటమిని తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. “గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు. అంతటి ప్రతిభావంతులైన భారత ఆటగాళ్లను పెట్టుకుని.. ఐర్లాండ్ వంటి పిచ్‌లపై ఇలాంటి ఫలితాలు రాబట్టడం కేవలం గంభీర్ లాంటి అసాధారణమైన ‘ప్రతిభ’ ఉన్నవాడికే సాధ్యం” అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ ఎగతాళి చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.

టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్.. గంభీర్ అనుసరించిన వ్యూహాత్మక లోపాలను ఎండగట్టారు. గతంలో జట్టులో ఆల్ రౌండర్లు తక్కువగా ఉండేవారని, కానీ గంభీర్ హయాంలో అవసరానికి మించి ఎక్కువ మంది ఆల్ రౌండర్లను జట్టులోకి తెస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు పార్ట్-టైమ్ ఆల్ రౌండర్లు కాదు.. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా ఆడే ఒక ప్యూర్ బ్యాటర్ అత్యంత అవసరమని మంజ్రేకర్ స్పష్టం చేశారు.

Also Read: ఢిల్లీలో షర్మిల ‘రాజ్యసభ’ రాకుండా అడ్డుకుంది ఎవరు..?

కఠినమైన విదేశీ పిచ్‌లపై భారత బ్యాటర్లు తడబడుతున్న విషయాన్ని మంజ్రేకర్ గుర్తుచేశారు. ఇలాంటి బౌలింగ్‌కు అనుకూలించే కండిషన్స్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆడిన అనుభవం ఉన్న శుభ్‌మన్ గిల్ లాంటి ఆటగాళ్లు జట్టుకు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గిల్‌కు ఇన్నింగ్స్‌ను నిర్మించే సత్తా ఉందని, అతడిని నెమ్మదిగా తిరిగి టీ20 ఫార్మాట్‌లోకి తీసుకురావాలని సూచించారు. జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కానున్న సిరీస్‌లోనైనా గంభీర్ తన తప్పులను సరిదిద్దుకుంటారో లేదో చూడాలి.