ఇంగ్లాండ్(England) పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు ఘోర వైఫల్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్లోనైనా పరువు కాపాడుకోవాలని చూస్తోంది. అయితే, ఈ ఓటములకు మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే కారణమని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని నేరుగా ఇంగ్లాండ్ వంటి కఠినమైన పిచ్లపై బరిలోకి దించడం పెద్ద తప్పుగా మారుతోంది.
టీమిండియా మేనేజ్మెంట్ వైభవ్ సూర్యవంశీని(Vaibhav Suryavanshi) అంతర్జాతీయ కెరీర్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కొత్తగా వచ్చే ఏ యువ ఆటగాడైనా మొదట చిన్న జట్లపై లేదా స్వదేశీ పిచ్లపై ఆడి సీనియర్ క్రికెట్ వాతావరణాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా, నేరుగా ఇంగ్లాండ్లోని స్వింగ్ మరియు బౌన్స్కు అనుకూలించే పిచ్లపై ఆడించడం వల్ల అతను అక్కడి పరిస్థితులను అంచనా వేయలేక వరుసగా ఫెయిల్ అవుతున్నాడనే ఒపీనియన్ బలంగా వినిపిస్తోంది.
ఈ తొందరపాటు నిర్ణయం వల్ల ఒక మంచి ప్రతిభ గల ఆటగాడిపై ఒత్తిడి పెరిగి, కెరీర్కే ముప్పు వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, అద్భుతమైన ఫామ్లో ఉండి, ఐపీఎల్ సహా అంతర్జాతీయ మ్యాచ్ల్లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను బెంచ్కే పరిమితం చేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు విఫలమవుతున్నా.. శాంసన్ లాంటి అనుభవజ్ఞుడిని ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకోకపోవడం యాజమాన్యం మొండితనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. మిడిల్ ఆర్డర్లో శాంసన్ ఉండి ఉంటే కచ్చితంగా స్కోరు బోర్డు నిలకడగా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. చివరి మ్యాచ్లోనైనా ప్రయోగాలు పక్కన పెట్టి, ఫామ్లో లేని వైభవ్ లేదా ఇషాన్ కిషన్లలో ఒకరిపై వేటు వేసి సంజూ శాంసన్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని, లేకపోతే ఇంగ్లాండ్ చేతిలో ఘోరమైన క్లీన్ స్వీప్ పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి