నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఒక పులి ప్రాణాలు కోల్పోవడం పట్ల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యమని, ఈ ఘటన మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తోందని పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. అడవులను, మూగజీవాలను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ విషాద ఘటన మనకు మరోసారి గుర్తుచేస్తోందని, వన్యప్రాణుల రక్షణ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.
ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను త్వరితగతిన వెలికితీసేందుకు తక్షణమే సమగ్ర, పారదర్శక విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్ ను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇది వృద్ధాప్యం వల్ల జరిగిన సహజ మరణమా, లేక వేటగాళ్ల దుశ్చర్య లేదా విషప్రయోగం వంటి కుట్రలు ఏమైనా ఉన్నాయా అనే అన్ని కోణాల్లోనూ నిష్పాక్షికంగా దర్యాప్తు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, ఇక్కడి విలక్షణమైన జీవవైవిధ్య రక్షణను కాపాడుకోవడం సమాజంలో మనందరి ప్రాథమిక కర్తవ్యమని ఆయన గుర్తుచేశారు.
ఇలాంటి ఘోరాలు భవిష్యత్తులో ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేందుకు అడవుల్లో పెట్రోలింగ్ ను తక్షణమే ముమ్మరం చేయాలని, క్షేత్రస్థాయి నిఘాను మరింత బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అడవుల పరిరక్షణకు, వన్యప్రాణుల రక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్న పవన్ కల్యాణ్, ఇందులో ఎవరి నిర్లక్ష్యమైనా ఉంటే ఊపేక్షించేది లేదన్నారు. ఈ దర్యాప్తులో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే వారిపై చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సంబంధిత కథనాలు
అదే వర్గం నుండి